మే 3, 2024

బస్సు, రైలు, విమానాల్లో పెంపుడు జంతువులతో ప్రయాణించాలంటే నిబంధనలు ఇవీ..

1 min read

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంత మంది ప్రయాణీకులు తమ పెంపుడు జంతువులు, కోళ్లు, మేకలతో సైతం బస్ ఎక్కుతూ ఉంటారు. కొన్ని సార్లు బస్సుపైన కోళ్ళను బుట్టల్లో పెట్టి, తాళ్లతో కట్టి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇలాంటి దృశ్యాలు నగరాల్లో కనిపించకపోవచ్చు కానీ, గ్రామాల్లో, పల్లెల్లో సర్వ సాధారణం.

తెలంగాణలోని సుల్తానాబాద్ లో మంగళవారం ఒక ప్రయాణీకుడు తన కోడితో పాటు ప్రయాణిస్తుండటంతో బస్సు కండక్టర్ ఆ కోడికి కూడా టికెట్ కొనమన్నారు. ఈ విషయం వార్తగా మారింది. గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళుతున్న బస్సులో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు వార్తాపత్రికలు పేర్కొన్నాయి. అయితే కోళ్లు, మేకలు లాంటి పెంపుడు జంతువులను ప్రజా రవాణా మార్గాల ద్వారా తీసుకుని వెళ్లవచ్చా? అలా తీసుకుని వెళుతున్నప్పుడు వాటికి కూడా టికెట్ కొనాల్సిన అవసరం ఉంటుందా?

ఆర్టీసీ బస్సులలో పెంపుడు జంతువులు ప్రయాణించేందుకు అనుమతి లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. సదరు ప్రయాణీకుడు తన చేతిలో ఉన్న కోడిని ఒక చీరతో కప్పి దాచిపెట్టి ఉంచాడని, సుల్తానాబాద్‌లో దానిని గమనించిన కండక్టర్ కోడిని బస్సులో తీసుకుని వెళ్లడాన్ని ప్రశ్నించాడని చెప్పారు. కానీ, బస్సులో ఒక ప్రైవేటు టీవీ చానెల్‌లో పని చేస్తున్న విలేఖరి కూడా ప్రయాణిస్తూ, ఆ కోడికి కూడా టికెట్ తీసుకోమని కండక్టర్ ను ప్రేరేపించినట్లు సజ్జనార్ తెలిపారు. దాంతో, కండక్టర్ కోడికి కూడా టికెట్ తీసుకున్నట్లు వివరించారు. ఈ సంఘటనను సదరు విలేఖరి వార్తగా మలుచుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. కండక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కోళ్లు, మేకలు లాంటి పశువులను బస్సులలో తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదని సజ్జనార్ తెలిపారు. వీటి గురించి ప్రత్యేక నిబంధనలేమి రాతపూర్వకంగా పొందుపరిచి లేవు. అయితే, రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకుని వెళ్ళవచ్చు. కానీ, వాటికి కొన్ని నిబంధనలున్నాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ బుక్ చేసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఆ వివరాలతో ట్రైన్ ఎక్కే స్టేషన్ చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ కు ఒక దరఖాస్తు చేయాలి. పెంపుడు జంతువుకు అవసరమైన అన్ని టీకాలను వేయించి సదరు సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. ప్రయాణానికి 24-48 గంటల ముందు మీ పెంపుడు జంతువు ప్రయాణానికి అనువుగా, ఆరోగ్యంగా ఉందని నిర్ధరిస్తూ పశువైద్యులు జారీ చేసే ధ్రువీకరణ పత్రాన్ని కూడా చేతిలో ఉంచుకోవాలి. ప్రయాణానికి నాలుగు గంటల ముందు క్యాబిన్ వివరాలు తెలియచేస్తారు. అక్కడ నుంచి పార్సెల్ ఆఫీసుకు వెళ్లి టికెట్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని వెళ్ళాలి. అక్కడ పెంపుడు జంతువును పరిశీలించి దాని బరువుకు అనుగుణంగా టికెట్ వసూలు చేస్తారు.