మే 3, 2024

క్రిప్టోకరెన్సీ చట్టం గురించి ఎందుకింత గందరగోళం? కీలక ప్రశ్నలు… సమాధానాలు

ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఒక చట్టం తీసుకువస్తోందనే విషయం వినగానే చాలా మందికి ఉపశమనం లభించాల్సింది. కానీ దానికి విరుద్ధంగా జరిగింది.

క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో కలకలం రేగుతోంది. అప్పుడప్పుడూ వస్తున్న వార్తలను చూస్తుంటే ఈ గందరగోళం కొనసాగుతుందనే అనిపిస్తోంది. మీరు ఆటల్లో టాస్ వేయడం చూసే ఉంటారు. కానీ పిల్లలు అప్పుడప్పుడూ టాస్ కోసం నాణేన్ని ఎగరేయడానికి బదులు కింద నేల మీద దాన్ని గిరగిరా తిప్పుతారు. ఆ నాణెం ఎంతసేపు, ఎంత గట్టిగా శబ్దం చేస్తూ గిరగరా తిరుగుతుంది, అది ఎప్పుడు పడిపోతుంది అనేది నాణెం బరువు, నేల ఎంత చదునుగా ఉందనేదాన్ని బట్టి ఉంటుంది.

బిట్ కాయిన్‌ది కూడా ప్రస్తుతం గిరగిరా తిరిగే ఆ నాణెం పరిస్థితే. ఇది ఎప్పటివరకూ అలా తిరుగుతూనే ఉంటుందో చెప్పడం చాలా కష్టం. దీని గురించి ఇంత వివరంగా చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ప్రభుత్వం దీనిపై చాలా విషయాలు స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ముసాయిదా బిల్లు తసుకురాగానే దీనిపై ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. కానీ, ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రశ్నలు వెల్లువెత్తడానికి పూర్తి అవకాశం ఉంది. అంటే, ఏ గందరగోళానికి తెరపడుతుందని ఆశిస్తారో, అది బహుశా మరింత పెరిగిపోవచ్చు. అందుకే ఈ నాణెం ఎప్పటివరకూ గిరగిరా తిరుగుతుందో తెలీదు.

క్రిప్టోకరెన్సీ బిల్లు ప్రవేశపెట్టడానికి పార్లమెంట్ విషయసూచికలో ప్రభుత్వం ఇచ్చిన వివరణను బట్టి, ఈ బిల్లు పేరును బట్టి మనకు ఇక్కడ రెండు విషయాలు జరగాలన్నది స్పష్టమవుతోంది. ఒకటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీ మీద నిషేధం విధించడం, రెండోది భారత రిజర్వ్ బ్యాంక్ వైపు నుంచి వచ్చే ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ ఎలా ఉంటుంది, అది ఎలా నడుస్తుందనే నిబంధనలు నిర్ణయించడం. రిజర్వ్ బ్యాంక్ ఒక డిజిటల్ కరెన్సీ తీసుకొస్తుంది. అది ఎలా నడుస్తుంది, ఎంత డిజిటల్‌గా ఉంటుంది, ఎంత కరెన్సీ ఉంటుందనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు త్వరలోనే మన ముందుకు వస్తాయి. ఎందుకంటే, ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, అంటే తర్వాత నెలకే రిజర్వ్ బ్యాంక్ తన కరెన్సీ పైలెట్ అంటే పరీక్షించడం ప్రారంభిస్తుంది. దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి.